ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు పవన్‌ కల్యాణ్‌ లేఖ

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే వాటిని వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించినట్లు పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా పవన్ ఎమ్మెల్యే రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.


అయితే గత కొన్ని రోజులుగా జనసేనతో సంబంధం లేదన్నట్లుగా రాపాక వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్‌ జరిగితే దానికి మద్దతుగానే ఓటు వేస్తానంటూ ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని ఆయన పేర్కొన్న విషయం విదితమే.